క్యాంపస్లలో కుల వివక్ష నిర్మూలనకు ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ
యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్
కాప్రా, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
విశ్వవిద్యాలయాలు, కళాశాల క్యాంపస్లలో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించాలని, యూజీసీ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.క్యాంపస్లలో ఏ విద్యార్థి పైనా కులం, మతం, ప్రాంతం, లింగం లేదా ఇతర సామాజిక ఆధారాలపై వివక్ష జరగకూడదని ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్, జిల్లా కార్యదర్శి కార్తిక్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విద్యాసంస్థల్లో సమానత్వం, భద్రత, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు యూజీసీ నిబంధనలు కీలకమని వారు తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ–డిస్క్రిమినేషన్ సెల్స్, గ్రీవెన్స్ కమిటీలు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.యూజీసీ మార్గదర్శకాల అమలుతో ప్రతి విద్యార్థికి వివక్ష రహిత విద్యా వాతావరణం లభిస్తుందని, కుల వివక్ష, హింస, వేధింపులపై అధికారిక ఫిర్యాదు వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని నాయకులు వివరించారు. అలాగే క్యాంపస్లలో మానసిక భద్రత, సామాజిక న్యాయం బలపడుతాయని, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రక్షణ, సహాయక వ్యవస్థలు అందుతాయని పేర్కొన్నారు. లింగ, మత, ప్రాంతీయ వివక్షలపై కఠిన చర్యలు తీసుకునే విధానాలు అమల్లోకి రావడం వల్ల విద్యార్థుల డ్రాప్అవుట్ రేటు తగ్గి సమాన అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, భయంలేకుండా, అవమానంలేకుండా అందరికీ విద్య అందాల్సిందేనని ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు. ఫీజుల భారం, వివక్ష కారణంగా విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి రాకూడదని, ప్రతి క్యాంపస్ “సేఫ్ అండ్ ఫ్రీ స్పేస్”గా మారాలని వారు డిమాండ్ చేశారు.ఈ ర్యాలీని కాప్రా మండల కమిటీ అధ్యక్షుడు శ్యామ్ నాయకత్వంలో నిర్వహించగా, కమిటీ సభ్యులు మణీష్, ప్రశాంత్ ముఖ్య పాత్ర పోషించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భగత్, జిల్లా కమిటీ సభ్యులు కౌశిక్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.


Comments