ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’ ప్రచారం!
వార్డుల్లో సుడిగాలి పర్యటన.. జనంతో మమేకం
అండగా ఉంటాం.. అబివృద్ధి చేస్తాం : ప్రసాద్ రెడ్డి
బ్రహ్మరథం పట్టిన జనం.. హోరెత్తిన ప్రచార ర్యాలీ
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 7(తెలంగాణ ముచ్చట్లు)
మున్సిపల్ పోరులో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. శనివారం ఏదులాపురం పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటనతో ఎన్నికల వాతావరణం ఫుల్ హీటెక్కింది. వార్డు వార్డుకూ తిరుగుతూ ఆయన చేసిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
*
ఉదయం శాబాదు నగర్ (28వ వార్డు), లిప్రసీ కాలనీ (30వ వార్డు) లలో ప్రసాద్ రెడ్డి పర్యటించారు. ప్రజలతో నేరుగా ముచ్చటించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
*ర్యాలీతో దద్దరిల్లిన వీధులు*
సాయంత్రం నాయుడుపేట (3వ వార్డు) నుంచి లక్ష్మి బృందావనం కాలనీ వరకు ర్యాలీ సాగింది. ఆదిత్య నగర్, కార్తికేయ టౌన్షిప్ మీదుగా సాగిన ఈ ర్యాలీకి జనం వెల్లువలా తరలివచ్చారు. దారిపొడవునా మహిళలు హారతులతో ప్రసాద్ రెడ్డికి వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ఏదులాపురం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments