హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు ప్రారంభం
రూ.30 కోట్లతో ఉప్పల్ నల్లచెరువు తరహాలో అభివృద్ధి
నాచారం, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్లోని పెద్ద చెరువును సుందరీకరించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ఉప్పల్ నల్లచెరువును ఆదర్శంగా తీసుకుని ఈ చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు.
సుందరీకరణకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ల తయారీ కోసం కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ ఇప్పటికే చెరువు పరిసరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ సర్వే పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.మొదటగా చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా డైవర్షన్ నాలా నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, గ్రీనరీ డెవలప్మెంట్, ఓపెన్ జిమ్ల ఏర్పాటు, చెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం వంటి విస్తృత స్థాయి సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఈ అభివృద్ధి పనులతో హెచ్ఎంటి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు విశ్రాంతి, వ్యాయామం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించనుందని కార్పొరేటర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, యాదగిరి రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments