సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ వేడి.!
కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరుపై అంచనాలు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఈ నెల 11వ తేదీన జరగనున్న సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగనుందన్న అంచనాలు ప్రజల్లో బలపడుతున్నాయి. మున్సిపాలిటీ పీఠం ఎవరి ఖాతాలో చేరుతుందోనన్న అంశంపై పట్టణవ్యాప్తంగా చర్చలు, గుసగుసలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రతి వార్డులో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన అంచనాకు రావడం కష్టంగా మారింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, గత పాలనపై ప్రజల అభిప్రాయాలు ఓటింగ్పై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ స్వయంగా ప్రచార వ్యూహాలపై దృష్టి సారించారు. మున్సిపాలిటీపై పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రతి వార్డును సమీక్షిస్తూ, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, వార్డు వార్డుగా పరిస్థితులను అంచనా వేయడం జరుగుతోంది. ప్రతి కౌన్సిలర్ అభ్యర్థితో సంప్రదింపులు జరుపుతూ స్థానిక సమస్యలు, ఓటర్ల స్పందనపై సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గతంలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తోంది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలకే పరిమితం కాకుండా, రెండు ప్రధాన పార్టీల ప్రతిష్ఠకు పరీక్షగా మారాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉద్ధృతం కానుండగా, సత్తుపల్లి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది.


Comments