పామిరెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
88 మంది లబ్ధిదారులకు ఉచిత చికిత్స, మందులు పంపిణీ
పెద్దమందడి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సాయి నేత్రాలయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ప్రతి నెల గ్రామపంచాయతీ పరిధిలో నిరుపేదల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం తెలిపారు.ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి ఆదేశాల మేరకు ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 88 మంది లబ్ధిదారులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.వారికి అవసరమైన చికిత్సతో పాటు మందులను సాయి నేత్రాలయ హాస్పిటల్ సిబ్బంది ఉచితంగా పంపిణీ చేశారు.ప్రతి నెల ఏదో ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి కి, గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం గారికి, సాయి నేత్రాలయ హాస్పిటల్ సిబ్బంది సంతోష్ యాదవ్ కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ పానుగంటి రాములమ్మ, మాజీ సర్పంచ్ తిక్కన్న, కాంగ్రెస్ నాయకులు ఎస్. మన్నెపు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘు గౌడు, ఏఎన్ఎం కౌసల్య, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


Comments