సీఎం కప్ క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం.
బి గంగారంలో నియోజకవర్గ స్థాయి పోటీల ప్రారంభం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి గంగారం గ్రామంలోని శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలకు శనివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన), గంగారం గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, ఉప సర్పంచ్ బెజవాడ రాధ, ఎంఈఓ, నియోజకవర్గంలోని క్రీడాకారులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, దాసరి మధు అన్న యువసేన సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments