విబిజి రామ్జీ 2025 చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి.
*ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.*
*ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ డిమాండ్.*
ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 9 (తెలంగాణ ముచ్చట్లు)
వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా కాంగ్రెస్ యూపీఏ హయాంలో వామపక్షాల సహకారంతో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెచ్చిన విబిజి రామ్జీ 2025 చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేద ప్రజలతో పాటు వ్యవసాయ కూలీల పని భద్రతకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లక్షలాది మంది పేద వ్యవసాయ కార్మికులకు పని కల్పిస్తూ వారి కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు.ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రామ్జీ 2025 చట్టం అమలుతో వ్యవసాయ కూలీలు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. గతంలో ఉపాధి హామీ పథకానికి 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించగా, ఇప్పుడు 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రాలు భరించాలనే విధానం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు.
ఈ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల్లో మాత్రమే పనులు కల్పించాల్సి ఉండటం వల్ల, మిగిలిన ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు పని హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే గ్రామపంచాయతీ ప్రణాళికలను బ్లాక్, జిల్లా స్థాయిలోని నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కలిపి, గ్రామాల అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు లోబర్చే ప్రమాదం ఉందని తెలిపారు.ఇలాంటి చర్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల పని హక్కు, కుటుంబ జీవన భద్రత తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వ్యవసాయ కూలీలు, రైతులు, పేద ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు.ఇటీవల నిర్వహించిన ఓపెన్ ఫోరంలో అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశామని తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
*ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి.*
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ హక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మందడి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ సమ్మెలో పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.


Comments