గులాబీ జెండా ఎగరడం ఖాయం.!
- సత్తుపల్లి,కల్లూరుల్లో బీఆర్ఎస్ మెజారిటీపై ధీమా.
- కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై అసంతృప్తి.
- బీఆర్ఎస్కు ప్రజల బలం.
- సండ్ర వెంకట వీరయ్య.
సత్తుపల్లి, ఫిబ్రవరి 9 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తుండగా, సత్తుపల్లి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల మూడ్ స్పష్టంగా బయటపడుతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో పార్టీ ప్రచారం దూకుడుగా కొనసాగుతోంది. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తమకు స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తోందని ఆయన తెలిపారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి కనిపించలేదు అన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మున్సిపాలిటీ కార్యాలయం, అంబేద్కర్ ఆడిటోరియం, అర్బన్ పార్క్, షాదికాన, 100 పడకల ఆసుపత్రి వంటి కీలక పనులు చేపట్టామని గుర్తు చేశారు. పూర్తైన ఆసుపత్రిని ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మార్కెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పట్టణం అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు. మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్లు, సంక్షేమ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజలు చెబుతున్నారన్నారు.
“అధికారం ఉందా లేదా అన్నది కాదు… సేవ చేయాలనే చిత్తశుద్ధి ముఖ్యం” అని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేసి చూపించిన అనుభవం తమకుందని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగాపనిచేసే అభ్యర్థులనే బీఆర్ఎస్ బరిలో దింపిందన్నారు.
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రెండు చోట్లా మెజారిటీ విజయాన్ని బీఆర్ఎస్ నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Comments