వెల్టూర్లో వారాంతపు సంత ఏర్పాట్ల పనులపై గ్రామ నాయకుల పరిశీలన
పెద్దమందడిఫిబ్రవరి(10తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్ గ్రామ నాయకులతో కలిసి సంత స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ ప్రజలకు అవసరమైన వాణిజ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపడుతున్న పనుల పురోగతిపై గ్రామ నాయకులతో వారు చర్చించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. వారాంతపు సంత గ్రామ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు.రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఈ సంత ద్వారా లభిస్తుందని తెలిపారు. దీంతో గ్రామంలో ఆర్థిక లావాదేవీలు పెరిగి, ప్రజలకు న్యాయమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.సంతకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సదుపాయం, షెడ్లు, చెత్త నిర్వహణ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ నాయకులకు సూచించారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.అలాగే గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు సంతను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంత నిర్వహణ ద్వారా గ్రామానికి ఆదాయం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా వారాంతపు సంత నిర్వహణ జరిగేలా గ్రామ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.


Comments