ఉప్పల్లో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంత్రి శ్రీధర్ బాబు
ఉప్పల్, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఉప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.సుమారు రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు నియోజకవర్గ రూపురేఖలను మార్చనున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ క్రీడా మైదానాలు, ఇండోర్–ఔట్డోర్ గేమ్స్ కాంప్లెక్స్, స్కూల్ భవనాల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు.చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా తెలంగాణ బిడ్డలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, శాసనమండలి సభ్యులు పట్నం మహీంద్ర రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments