జాతీయ ఓడరేవుల నియామక పరీక్షలో నాగులవంచ యువకుడి ప్రతిభ.......
సివిల్ ఇంజనీరింగ్లో దేశవ్యాప్తంగా 5వ ర్యాంక్...
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన షేక్ సలీం జాతీయ స్థాయిలో నిర్వహించిన భారత ఓడరేవుల (పోర్ట్స్ అథారిటీ) సివిల్ ఇంజనీరింగ్ నియామక పరీక్షలో విశేష ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా 5వ ర్యాంక్ సాధించాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ( హాల్ టికెట్ నెంబర్ : ఐపి 525007943) 160 మార్కులకు గాను 146.25 మార్కులు సాధించి ఈ ఘనతను అందుకున్నాడు.
దేశవ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 14 పోస్టులు భర్తీ చేయగా, అందులో 9 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 5 అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్) పోస్టులు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు సలీం అర్హత సాధించాడు. ఈ నియామక పరీక్ష 2025 డిసెంబర్ 2న నిర్వహించబడింది.
2002 జనవరి 2న జన్మించిన సలీం, 1 నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివాడు. అనంతరం న్యూ విజన్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 2020లో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి తెలంగాణలో 5వ ర్యాంక్ పొందాడు. తర్వాత ఎన్ఐటీ వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ను 2024లో పూర్తి చేశాడు.
భవిష్యత్తులో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ ఇఎస్) సాధించడమే తన లక్ష్యమని సలీం తెలిపారు. అతని తండ్రి నాగుల్ మీరా ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మామిళ్లగూడెంలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.తమ గ్రామానికి చెందిన యువకుడు జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం పట్ల నాగులవంచ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ సలీంను అభినందించారు.


Comments