పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహణకు చర్యలు: కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భద్రతా బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చి, బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు.జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ మను చౌదరి కోరారు.


Comments