నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోరుతూ కాప్రాలో అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె
కాప్రా, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాప్రా జీహెచ్ఎంసీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈసీఎల్ చౌరస్తాలో గురువారం సార్వత్రిక సమ్మె చేపట్టారు. పెద్ద ఎత్తున హాజరైన కార్మికులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.కార్మికులు మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, వేతన హామీలపై స్పష్టత లేకపోవడంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విరమించి, కార్మికులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తమ సేవలను గుర్తించి తగిన వేతనాలు చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన మున్సిపల్ కార్మికులకు వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సాయిలు, జాన్, చంద్రయ్య, ఏ.జాన్, శివకృష్ణ, మంజుల, కే.లక్ష్మి, అరవింద్, యాదగిరి, అనసూయ, నరసింహులు, ఆంజనేయులు, నర్సింగ్ రావు, నరేష్, జ్యోతి, జమున, వీరేష్, ఎం.సాయి కుమార్, స్వామి, సాయి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.సమ్మె శాంతియుతంగా కొనసాగగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.


Comments