మార్చి 1న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక
--- ఖమ్మంలో భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 12(తెలంగాణ ముచ్చట్లు)
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు మార్చి 1న ఖమ్మంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు అటల్ బిహారి వాజ్ పేయి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుద్దుకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దుద్దుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా మాజి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖమ్మం వస్తున్నారని, వారితోపాటు ప్రముఖ కవి, రచయిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, అఖిలభారత సామాజిక సమరసత కళావిభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్, రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఖమ్మం ఎస్సార్ గార్డెన్ లో జరిగే అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలలో 'అటల్ జీకి అక్షర నీరాజనం కవితా సంకలనం' పుస్తక ఆవిష్కరణ ఉంటుందన్నారు. భారతదేశాన్ని ప్రగతి బాటలో నడిపిన మహా నాయకుడు వాజ్ పేయి అని, వారు చూపిన మార్గాన్ని భావితరాలకు చేరేవిధంగా శతజయంతి వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వడ్లమూడి సురేష్, కోశాధికారి మల్లెంపాటి రమేష్, కార్యదర్శులు యలమందల మధు, బోళ్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


Comments