హరిత ఎంక్లేవ్లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
కాప్రా, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ పరిధిలోని హరిత ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి కాలనీవాసులతో కలిసి పర్యటించారు. కాలనీ ప్రధాన రహదారిలో యూజీడీ పైప్లైన్ తరచుగా పొంగిపొర్లుతూ మురుగునీరు రోడ్లపై నిలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.సమస్య విషయం తెలిసిన వెంటనే కాలనీలోకి వచ్చి హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి అధికారులతో మాట్లాడి సిబ్బందిని పిలిపించి భూగర్భ పైప్లైన్ మ్యాన్హోళ్లను శుభ్రం చేయించామని స్వర్ణరాజ్ శివమణి తెలిపారు. పలువురు పాదాచారులు, వాహనదారులు మురుగునీటిలో జారిపడి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉందని కాలనీవాసులు వాపోయారని చెప్పారు. సంబంధిత అధికారులకు, హెల్ప్లైన్కు ఫిర్యాదులు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.హరిత ఎంక్లేవ్లో ఇప్పటికే సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ స్థంబాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేసిన ఆయన, ప్రధాన రహదారిలో పాత డ్రైనేజీ స్థానంలో రూ.1.80 కోట్ల నిధులతో భూగర్భ బాక్స్ డ్రైనేజీ వ్యవస్థను త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా పార్క్ స్థలంలో చైన్ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం, శౌచాలయాలు, సౌందర్య వనంతో ఆధునిక పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.సమస్య పరిష్కారానికి తక్షణ స్పందన చూపిన స్వర్ణరాజ్ శివమణికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఏ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments