బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ
వనపర్తి,ఫిబ్రవరి12(తెలంగాణ ముచ్చట్లు):
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన సభ, ర్యాలీ నిర్వహించారు. సభ అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా బారిర్యాలీ చేపట్టారు.సభకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం. రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టియుసిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. అరుణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు.పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను హరించారని ఆరోపించారు. పని గంటలను పెంచే ప్రయత్నాలు, వేతనాల నిర్ణయంలో ఏకపక్ష విధానం, సంఘాల గుర్తింపులో మార్పులు, సామాజిక భద్రత చట్టాలలో సవరణలు చేసి కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అన్నారు.రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిందని, పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్లు మన్నిస్తూనే రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యవసాయ కార్మిక సంఘం, వికలాంగుల సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.


Comments