ఓటమి భయంతో గిఫ్టుల వసూలు?
10వ వార్డులో ఉద్రిక్తత.
అశ్వరావుపేట, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. తనను గెలిపించాలని ఓటర్లను ప్రలోభ పెట్టి గిఫ్టులు, నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పుడు ఓటమి భయంతో వాటిని తిరిగి వసూలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపులో తాను ఓడిపోతానన్న అనుమానంతో, ఓటర్ల ఇళ్లకు వెళ్లి ముందుగా ఇచ్చిన గిఫ్టులు, నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకు ఓటు వేయకుండా ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆరోపిస్తూ, ఇచ్చిన కుక్కర్లు, ఇతర గృహోపకరణాలు తిరిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
అధికార పార్టీ అండతో ఓటర్లపై ఒత్తిడి తీసుకొస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటువంటి చర్యలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, 10వ వార్డులో ఆధార్ పార్టీ అభ్యర్థి కరిష్మా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అనుచరులు భావిస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఆమెకు మద్దతుగా ఓటర్లు సమాయత్తమయ్యారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థి ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Comments