జిల్లా ప్రజలకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు.!
- మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఘన విజయం.
- సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ప్రజా పాలనపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి సమిష్టి కృషి, పట్టుదల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని మంత్రి అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలిచారని, అభివృద్ధి మరియు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, సేవలను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడిచిందని మంత్రి కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి మంత్రి తుమ్మల హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా స్వీకరించి, మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


Comments