చర్లపల్లి చెరువుకు త్వరలోనే సుందరీకరణ పనులు పూర్తి చేస్తాం
హైడ్రా కమిషనర్ రంగనాథ్
చర్లపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ పరిధి లోని చర్లపల్లి చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి సుందరీకరణ పనులను వేగవంతం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం బుద్ధ భవన్లోని తన కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చర్లపల్లి చెరువు ఆధునీకరణ పనులు ఆలస్యమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా మౌలిక వసతులు, అందమైన వాకింగ్ ట్రాక్లు, లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments