శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివాలయం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా జరిగే శివరాత్రి జాతర మహోత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు.
విద్యుత్ వెలుగుల్లో ఆలయ ప్రాంగణం
ఉత్సవాల సందర్భంగా శివాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, తోరణాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు మరియు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.
కనులపండువగా శివపార్వతుల కల్యాణం
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రాత్రి 8:00 గంటలకు శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు, ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు.


Comments