చాణిక్య సర్వేనే నిజమైంది
--- మున్సిపల్ ఎన్నికల్లో చాణిక్య పొలిటికల్ సర్వే రిపోర్ట్ సక్సెస్
--- 95శాతం సక్సెస్ రేట్ తో చాణిక్య సర్వే ఫలితాలు
--- విలేకరుల సమావేశంలో చాణిక్య స్టాటజీస్ పొలిటికల్ సర్వే ఏజెన్సీ ఎండి చాణిక్య ముఖేష్ హర్షం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 13(తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల గెలుపు, ఓటములపై తాము చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేలో 95శాతం వాస్తవాలు వెల్లడి అయ్యాయని, చాణిక్య సర్వే చెప్పిందే నిజమైందని చాణిక్య స్టాటజీస్ పొలిటికల్ సర్వే ఏజెన్సీ ఎండి చాణిక్య ముఖేష్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చాణిక్య ముఖేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 121 మున్సిపాలిటీ ఎన్నికలలో, 40 మున్సిపాలిటీలకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటుచేసి సర్వే అండ్ స్టాటజీస్ తో అక్కడి అభ్యర్థుల గెలుపుకు అవసరమైన అన్ని వ్యూహాలు రచించడంలో తమ సంస్థ విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో తాము చేపట్టిన సమగ్ర సర్వేలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రేడ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలలో పొంగులేటి సోదరుల విస్తృత ప్రచారం ప్రజల్లో ప్రభావితం చేసిందని, ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతుందని తాము వెల్లడించిన విధంగానే ఫలితాలు వచ్చాయన్నారు. చైర్మన్ ల పదవులు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, కొన్ని వార్డులలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని, తాము చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చాయన్నారు. ఏదులాపురం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాలలో తమ ప్రతినిధులు క్షుణ్ణంగా, అన్ని అంశాలను క్రోడీకరించి క్షేత్రస్థాయిలో ఎవరు గెలుస్తున్నారు, వారికి ఉన్న విజయావకాశాలు ఏ మేరకు ఫలిస్తాయో, అన్ని అంశాలపై ముందుగానే తమ సంస్థ పసిగట్టి వాస్తవ రిపోర్టును ముందుగానే తెలియజేయడం జరిగిందని వెల్లడించారు. తాను ఈ జిల్లాకు చెందిన వానిగా సుపరిచితమేనని, గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తూ, ప్రముఖమైన సర్వే సంస్థలలో ఐదో స్థానంతో మంచి గుర్తింపు సాధించామన్నారు. అదే చాణిక్య సర్వే రిపోర్ట్ మరోసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వెళ్లడైందని హర్షం వ్యక్తం చేశారు. తమ చాణిక్య సర్వే ఏజెన్సీ కి సహాకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి ఉమా శంకర్ పాల్గొన్నారు.


Comments