గోపాల్పూర్ గ్రామంలో మట్టి గోడ కూలి యువకుడు మృతి
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 13: (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలం పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెండ్యాల సాంబరాజు (39) అనే యువకుడు మట్టి గోడ కూలి మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం, గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇంటి అడ్డంగా ఉన్న మట్టి గోడకు ఆనుకుని సాంబరాజు తన భార్య, కూతురుతో కలిసి మంచం వేసుకుని నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా మట్టి గోడ కూలి వారిపై పడింది. గోడ నేరుగా సాంబరాజుపై పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది వచ్చి పరిశీలించగా, అప్పటికే సాంబరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలోభార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం అని గ్రామస్తులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


Comments