నీతి, నిజాయితీతో ఆదర్శ మున్సిపాలిటీల నిర్మాణం
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు):
నీతి, నిజాయితీతో పాలన అందించి మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు.మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని శిబిర కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజల ఆశీర్వాదంతో వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేశారని పేర్కొన్నారు.గ్రామపంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి 75 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారని అన్నారు.మత రాజకీయాలు చేస్తున్న బిజెపి రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిన బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెండ్ చేసిన వారిని భవిష్యత్తులో పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.అనంతరం నూతనంగా విజయం సాధించిన కౌన్సిలర్ అభ్యర్థులను ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, విజయం సాధించిన వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments