అభివృద్ధికి ప్రజల మద్దతు..
*ప్రజా ప్రభుత్వంపై నమ్మకానికి ఈ గెలుపే నిదర్శనం:*
*డిప్యూటీ సీఎం భట్టి*
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 13(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందించారు.
ఈ ఫలితాలు రాష్ట్రంలో సాగుతున్న ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం నేడు ఘనమైన ఆదరణగా మారిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం సమష్టిగా పనిచేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక రంగాల్లో సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఈ భారీ విజయం ప్రభుత్వ పారదర్శక పరిపాలనకు, అభివృద్ధి కార్యాచరణకు లభించిన గౌరవంగా ఆయన భావిస్తున్నారు.
కార్యకర్తల నిరంతర శ్రమ, ప్రజల అభివృద్ధి కాంక్ష ఈ గెలుపుకు పునాదులని డిప్యూటీ సీఎం కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైన ఈ ఆదరణ భవిష్యత్తులో రాబోయే మరిన్ని మార్పులకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో, కట్టుబాటుతో పనిచేస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.


Comments