సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కమలానగర్ కార్యాలయంలో ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ వర్ధంతి మరియు ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా సోక్రటీస్ చిత్రపటానికి ఐద్వా నాయకురాలు, మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గెలీలియో చిత్రపటానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఈసీఐఎల్ మాజీ అధికారి ఎం. భాస్కర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ, గెలీలియో నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని టెలిస్కోప్ ద్వారా రుజువు చేసి విజ్ఞాన విప్లవానికి దారితీశారని తెలిపారు. మూఢనమ్మకాలపై శాస్త్రీయ దృక్పథంతో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎం. భాస్కర్ రావు మాట్లాడుతూ, సోక్రటీస్ సమాజంలో ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించిన గొప్ప తత్వవేత్త అని అన్నారు. ఆయన బోధనలను ఆయన శిష్యుడు ప్లేటో ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చల్లా లీలావతి, శారద, యాదగిరిరావు తదితరులు ప్రసంగించారు. ఎన్. శ్రీనివాస్, హిందీ పండిట్ లక్ష్మయ్య, ఉమామహేశ్వరరావు, భాస్కర్ రావు, శారద, లీలావతి, రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులందరూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Comments