న్యూఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఖమ్మం యువకుడి..
గోగినేని ఆకాష్ తీసిన విజ్ఞాన సాంకేతిక నేపథ్య స్వల్పచిత్రం ‘లూనా’కు ప్రతిష్ఠాత్మక పురస్కారం..
ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు)
దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా వైభవంగా నిర్వహించిన న్యూఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ఖమ్మం నగరానికి చెందిన యువ దర్శకుడు గోగినేని ఆకాష్ రూపొందించిన విజ్ఞాన సాంకేతిక నేపథ్య స్వల్పచిత్రం ‘లూనా’ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పలు చిత్రాల మధ్య ‘లూనా’ ప్రత్యేక గుర్తింపు సాధించడం గర్వకారణంగా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చలనచిత్రోత్సవానికి అధికారికంగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. తాజా విజయంతో దర్శకుడు ఆకాష్ సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయి చేరుకున్నాడు. తన సృజనాత్మక దృష్టి, సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ‘లూనా’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ పురస్కారాన్ని హను రోజ్ చేతుల మీదుగా ప్రదానం చేయడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆకాష్ తరపున ఆయన తల్లిదండ్రులు గోగినేని కిరణ్ కుమార్, హిమబిందు ఫిబ్రవరి 13న జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో పాల్గొని, 14వ తేదీన పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గోగినేని కిరణ్ కుమార్, హిమబిందు మాట్లాడుతూ, “మా కుమారుడు చిన్నప్పటి నుంచే సృజనాత్మకమైన విషయాలా పై ప్రత్యేక ఆసక్తి కనబరిచేవాడు అని . ఎన్నో సవాళ్లు ఎదురైనా తన లక్ష్యాన్ని వదలకుండా కృషి చేశాడు. దేశ రాజధానిలో పురస్కారం అందుకోవడం మా కుటుంబానికి గర్వకారణం. ఖమ్మం పేరు జాతీయ స్థాయిలో వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు
. ఖమ్మం యువ దర్శకుడి ఈ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘లూనా’ చిత్రం యువతకు స్ఫూర్తినిస్తూ ఖమ్మం ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా చాటింది.


Comments