చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు

చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు

*ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి*

*-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్*

*-17న"ఛలో సమాచార భవన్"కు పిలుపు*

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని  పత్రికలకు ఎంప్యానల్‌మెంట్ తో సంబంధం లేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన "ఛలో సమాచార భవన్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార పౌరసంబధాల కమిషనర్ కార్యాలయం(సమాచారభవన్) ఎదుట జరిగే  జర్నలిస్టుల నిరసన కార్యక్రమంలో వివిధ పత్రికల నిర్వహకులు,
జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 44 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ కేవలం ఎంపానల్మెంట్ అయిన కొన్ని పత్రికలకు, చానళ్ళకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులిచ్చే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పద్దతిని తుంగలో తోక్కి పత్రికలకు ఎంప్యానల్ ముసుగు తొడిగి, నిబంధనల పేరుతో చిన్న,మధ్య తరహా పత్రికలను పాతాళానికి తొక్కారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే చిన్న మధ్య తరహా పత్రికలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగుతుందని మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వం జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై ఆనాడు గొంతెత్తిన ఈనాటి పాలకులు అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా...అనేక పత్రికలను ఎంపానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు  అన్యాయం చేస్తున్నారనని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన  పాలకులు మీడియా అక్రిడిటేషన్ ల విషయంలోనే వివక్ష చూపుతూ చిన్న మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంప్యానల్ చేయకుండా రెండేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనీసం అక్రెడిటేషన్లు ఇవ్వకుండా అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎంప్యానల్ లిస్టులో ఉన్న చాలా పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించి జర్నలిస్టులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సందర్బాన్ని బట్టి దరఖాస్తు చేసుకుంటే అడ్వర్టయిజ్మెంట్ తో పాటు అక్రెడిటేషన్ ఇచ్చే వారని, ప్రస్తుతం అడ్వర్టయిజ్మెంట్ల సంగతి దేవుడెరుగు గానీ...కనీసం అక్రెడిటేషన్ కార్డు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ వివక్ష కారణంగా స్వరాష్ట్రంలో చిన్న పత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని, దీని వల్ల ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులకు పత్రికల నిర్వహణ భారమవుతుందని అన్నారు. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు ఎంప్యానల్‌లో ఉన్న పత్రికలను ఆ జాబితా నుంచి తొలగించడం చాలా భాదాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ
రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రతి పత్రికకు అక్రిడిటేషన్‌ కార్డులు గతంలో మాదిరిగా ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయా పత్రికలకు ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక  అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక ఎకరం భూమిని  ప్రభుత్వ నామినల్ ధరకు ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఉన్న జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు,భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు