విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
నాగారం, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
శిల్పానగర్లోని విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ లో వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల క్రీడా కేకలతో కిటకిటలాడింది.
ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ డాక్టర్ నంద్యాల నరసింహారెడ్డి పాల్గొని బెలూన్లు ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని, క్రీడలు ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేశం మనకేమి ఇచ్చిందనే దానికంటే దేశానికి మనం ఏమి ఇస్తున్నామనే భావనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు పిరమిడ్స్, టైక్వాండో, ఆర్చరీ, బాస్కెట్బాల్, కబడ్డీ, లాంగ్ జంప్, షాట్పుట్, స్కేటింగ్ వంటి విభిన్న క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ సైక్లిస్ట్ సంస్థ ఫౌండర్ రవీందర్ నందనూరి విశిష్ట అతిథిగా పాల్గొని సైక్లింగ్ ప్రయోజనాలను వివరించారు.విజేతలకు పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె. సరితా రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమా దేవి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments