పశుపతినాథ్ దేవస్థానం దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో దశమ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ఉత్సవాలు విజయవంతంగా ఆరంభమయ్యాయని తెలిపారు. స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, రుద్రహోమం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రహోమ కార్యక్రమాన్ని విజయ భావనారుషి, సుశీల రత్నాకర్ రావు దంపతులు నిర్వహించారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు అన్నప్రసాదం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్వేతా శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి,
ఉప సర్పంచ్ అంబల అనిల్ కుమార్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల హర్షధ్వానాల మధ్య ముగిశాయి.


Comments