శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
నాచారం, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ కైలాసగిరి బంజారా భవన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాకుండా సమస్త ప్రజలకు ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు. గిరిజనుల కు దశదిశలను చూపి హైందవ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ అహింసా సిద్ధాంతానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన నిలిచారని అన్నారు.గిరిజనుల అభివృద్ధి, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం రాష్ట్ర గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్ల వ్యయంతో గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు రాందాస్ నాయక్, శ్రీనివాస్ నాయక్, లింగ నాయక్, రాంజీ, హేమ, విద్య, కమలాకర్, రామచందర్, లచ్చిరాం, చందర్, పాండు తుక్క తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, గుమ్మడి జంపాల్ రెడ్డి, నవీన్ గౌడ్, హరినాథ్ రెడ్డి, శేఖర్ గౌడ్, యాకుబ్, పూస రమేష్, చారి, రామకృష్ణ, సామ్ సన్, భూలక్ష్మీతో పాటు బంజారా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Comments