పూలు, పండ్లతో శివాలయం శోభ.!
సదాశివుని పాలెంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని సదాశివుని పాలెం గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివ లింగేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించడంతో భక్తులను ఆకట్టుకుంది. తుమ్మూరు ప్రతాపరెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణాన్ని బంతిపూలు, చామంతులు, గులాబీలు, ఆపిల్స్, కమలాలు, ద్రాక్ష, ఎర్ర అరటిపండ్ల గెలలు తదితర పూలు, పండ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. యానాం నుంచి ప్రత్యేకంగా అరటి గెలలు, పూలు తెప్పించి భక్తుల సహకారంతో సుమారు 10 గంటలపాటు శ్రమించి ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం భక్తులకు తీర్థం, ప్రసాదాలు అందజేసి ఆలయ ప్రాంగణంలో భక్తి పారవశ్యంతో గడిపేలా ఏర్పాట్లు చేశారు.


Comments