కుట్రపూరిత రాజకీయాలతో నన్ను అడ్డుకున్నారు
కాంగ్రెస్ లో ధనవంతులకే ప్రాధాన్యం.. నిబద్ధత గల కార్యకర్తకు అన్యాయం
-- ధ్యారపోగు వెంకటేష్ ఆవేదన
వనపర్తి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలుగా విధేయుడిగా పనిచేసిన తనకు వనపర్తి మున్సిపాలిటీ పురపాలక సంఘ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఇవ్వకుండా కావాలనే అడ్డుకుని అవమానించారని 21వ వార్డు సభ్యుడు ధ్యారపోగు వెంకటేష్ ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయాలతో తనను పక్కనబెట్టి, అనంతరం పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరమని ఆయన వాపోయారు.పార్టీ జెండా మోసి నిస్వార్థంగా పనిచేసిన వారికి కాకుండా ధనవంతులకే అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. జిల్లా సామాజిక మాధ్యమాల సమన్వయ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ తన సేవలను గుర్తించలేదని తెలిపారు. సర్వేలో తన పేరు ఉన్నప్పటికీ నాయకుల బంధువైన ధనలక్ష్మి అనే మహిళకు అభ్యర్థిత్వం కేటాయించారని పేర్కొన్నారు.ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చారని విమర్శించారు. తనను దళితుడని అవమానించి అభ్యర్థిత్వం నిరాకరించారని ఆరోపించారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ పార్టీ నాయకులు ఎవరూ సహకరించలేదని అన్నారు.21వ వార్డు ప్రజలు తనను ఆదరించి 297 ఓట్లు ఇచ్చారని, కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయానని గుర్తు చేశారు. తిరిగి లెక్కింపులో కూడా రాజకీయ ప్రలోభాలతో అన్యాయం జరిగిందని ఆరోపించారు.జిల్లా స్థాయిలో జరిగిన ఈ అన్యాయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, తనపై విధించిన బహిష్కరణను ఎత్తివేసి న్యాయం చేయాలని కోరుతామని వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించి తనకు అవకాశం రాకుండా అడ్డుకుని, గెలవకుండా ప్రయత్నించి రోడ్డుపైకి లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Comments