ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి -16(తెలంగాణ ముచ్చట్లు)
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వైరా మండలం గన్నవరం గ్రామం నుండి కిన్నెర రాణి, తనకు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మొదటి విడత డబ్బులు జమ అయినట్లు, తదుపరి విడతల డబ్బులు జమకాలేదని, ఇప్పించుటకు కోరగా, హౌజింగ్ పిడి ని పరిశీలించి, తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మంచుకొండ, కోయచిలక గ్రామ రైతులు, తమకు రఘునాధపాలెం మండలం, మంచుకొండ, కోయచిలక రెవెన్యూ శివాయిగూడెం పరిధిలోగల సర్వే నెంబర్లు 174, 175, 362, 364/92 లలో గల స్వంత వ్యవసాయ భూములకు, వైకుంఠదామం, డంపింగ్ యార్డు లకు వెళ్లే దారిని, అట్టి భూమితో సంబంధం లేని వ్యక్తి నిరోధిస్తున్నట్లు, తమకు న్యాయం చేయాలని కోరగా, తహశీల్దార్ ను తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కొనిజర్ల నుండి సయ్యద్ లాల్ బి కొనిజర్ల మండలం, గుండ్రాతిమడుగు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 421/1/లూ లో 2 ఎకరాల భూమి తన పేరున ఉన్నట్టు, అట్టి భూమిలో 1 ఎకరం తన పెద్ద అమ్మాయికి బహుమానంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు, మిగిలిన ఎకరం భూమిని తన చిన్న అమ్మాయికి బహుమానంగా రిజిస్ట్రేషన్ చేయాలని మీ సేవ కేంద్రానికి వెళ్ళగా, అట్టి భూమి అసైన్డ్ భూమిగా చూపిస్తుందని, అట్టి దానిని పిఓపి నుండి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహశీల్దార్ కు రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ గోపాలపురం గ్రామం నుండి ఎస్ కె. రజియా, తనకు ఇల్లు లేదని, భర్త ఆక్సిడెంట్ అయి, ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కు దరఖాస్తు చేయగా, హౌజింగ్ పిడి కి పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments