స్వ రాష్ట్ర కలను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్
మాజీ ఎంపీ నామ
జననేత కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు - మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 16(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ స్వరాష్ట్ర కలను నిజం చేసి, సాధించుకున్న తెలంగాణను యావత్ దేశానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అని పేర్కొన్నారు. మంగళవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బిఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేయడమే కాకుండా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఆర్థిక భరోసా కల్పించారని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చారని పేర్కొన్నారు. పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, కళ్యాణణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని అన్నారు. ఆరోగ్య రంగంలో కేసీఆర్ కిట్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించారని తెలిపారు. విద్యారంగంలో గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విస్తరణ ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని కొనియాడారు. అలాగే, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కేసఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ప్రజల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments