మధిర మున్సిపల్ పీఠం హస్తం కైవసం
చైర్పర్సన్గా సామినేని సుజాత, వైస్ చైర్మన్గా కోన ధని కుమార్ ఎన్నిక
హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 16(తెలంగాణ ముచ్చట్లు)
మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్గా కోన ధని కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం మధిర ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. ముందుగా అభినందనల వెల్లువ
అంతకుముందు, మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానించారు. భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు వారిని అభినందించిన ఆయన, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి కౌన్సిలర్లతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.
ప్రమాణ స్వీకారం.. ఎక్స్ అఫీషియో ఓటు
ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం జరిగిన ప్రక్రియలో భట్టి విక్రమార్క తన ఎక్స్ అఫీషియో ఓటును వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో చైర్పర్సన్ పదవికి సామినేని సుజాత, వైస్ చైర్మన్ పదవికి కోన ధని కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నవీన్ బాబు అధికారికంగా ప్రకటించారు.
అభివృద్ధికి బాటలు వేస్తాం: భట్టి
ఎన్నిక అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


Comments