ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేట.!
- సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే జారె.
- నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా.
- చైర్మన్గా జూపల్లి శశికళ,
- వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్ బాబు బాధ్యతలు స్వీకారం.
అశ్వారావుపేట, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలి చైర్మన్గా ఎన్నికైన జూపల్లి శశికళ, వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్ బాబు, 15 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశ్వారావుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో ఏకమై పనిచేయాలని సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అలాగే తొలి చైర్మన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, ఒక్క కాలనీ కూడా వెనుకబడకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ 
వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పారు.
కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Comments