ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా కొనసాగుతారు
– తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి
హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో గన్ పార్క్లోని అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది చేసిన త్యాగాలను పక్కనబెట్టి, కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవితకు మాత్రమే ప్రాధాన్యం దక్కిందని, సాధారణ ఉద్యమకారులకు సముచిత స్థానం లభించలేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వ విధానాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు.ప్రస్తుత ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పిడమర్తి రవి పేర్కొన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని మంత్రిమండలి ప్రకటించడం, హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, అలాగే ఉద్యమకారులకు పింఛన్ మంజూరు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.
ఉద్యమకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇదే విధంగా కృషి చేస్తే రేవంత్ రెడ్డి మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎండి రహీం, డాక్టర్ బోమ్మెర స్టాలిన్, చిరుమర్తి రాజు, డాక్టర్ మీసాల మల్లేష్, బోరెల్లి సురేష్, చింతమల్ల శోభన్ బాబు, సైదాబాద్ గణేష్, ఆంజనేయులు, కంపాటి వెంకట్గౌడ్, దేవరకొండ నరేష్, నక్క మహేష్, జోగు గణేష్, ఆరెకంటి శ్రీకాంత్, చాగంటి శేఖర్, ఓంకార్, రాజు యాదవ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments