ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా పరిశీలించారు.శామీర్పేట్ మండలంలోని తూంకుంటలో ఉన్న సాయితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ, ఉప్పర్పల్లిలోని ఎక్సెలెన్సియా జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, పరీక్షల నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా పరీక్షా గదులను సందర్శించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షలు ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.పరీక్షా కేంద్రంలో హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, డిస్ప్లే రూమ్ ద్వారా ప్రతి గదిని పరిశీలించారు. ప్రశ్నా పత్రాలు నిర్ణీత సమయానికే తెరిచారా, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి ఇచ్చారా వంటి అంశాలపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.ఈ పర్యటనలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, శామీర్పేట్ తహసీల్దారు సుచరిత తదితరులు పాల్గొన్నారు.


Comments