డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసుల నమోదు…
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి -25(తెలంగాణ ముచ్చట్లు)
ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సిఎంఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ సిల్కీ సార్టెక్స్ రైస్ మిల్ యాజమాన్యం 2021–22 ఖరీఫ్, 2022–23 ఖరీఫ్, రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వానికి బియ్యం అందజేయడంలో విఫలమై 9.49 కోట్ల రూపాయలు అసలు బకాయి కలిగి ఉండగా, పెనాల్టీలతో కలిపి 13.84 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు మేనేజింగ్ భాగస్వామి కన్నేటి జ్యోతి, భాగస్వామి మామిడాల మానసపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 129/2026 నమోదు చేయబడిందని అన్నారు.
అలాగే నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 2022–23 ఖరీఫ్, రబీ సీజన్లలో 7.59 కోట్ల అసలు బకాయి కలిగి ఉండగా, పెనాల్టీలతో కలిపి 10.88 కోట్ల వరకు డిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు యజమాని మేకల రామారావుపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 47/2026 నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ధాన్యం, నిధుల పరిరక్షణలో రాజీ పడబోమని, డిఫాల్ట్ చేసే మిల్లర్ల పై చట్టపరమైన కఠిన చర్యలు కొనసాగుతాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. బకాయిల వసూలు చర్యలు వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖల ద్వారా తదుపరి విచారణ కొనసాగుతున్నదని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.


Comments