22 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.547 కోట్ల సైబర్ మోసం.
- 14 మంది అరెస్ట్.. 8 మంది పరారీ.
- విదేశీ కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ మోసాలు.
- టెలిగ్రామ్ లింకులు, క్యూఆర్ కోడ్లతో బాధితుల నుంచి దోపిడి.
- వివరాలు వెల్లడించిన ఏసీపీ వసుంధర యాదవ్.
సత్తుపల్లి, ఫిబ్రవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):
రూ.547 కోట్ల భారీ సైబర్ మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జనవరి 11న వీయం బంజర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకోగా, మరో 8 మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.
మంగళవారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. అనంతరం అడపా రామ వెంకట చరణ్ చౌదరిని సత్తుపల్లి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా కీలక సమాచారం లభించిందన్నారు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా అదే రాత్రి మరో 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో నిందితులు 2020 నుంచి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, స్టాక్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్, మ్యాట్రిమోనీ, ఓటీపీ మోసాల పేర్లతో ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకున్నట్లు గుర్తించారు. బాధితులను టెలిగ్రామ్ గ్రూపులకు చేర్చి నకిలీ లింకులు, క్యూఆర్ కోడ్లు పంపించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు మళ్లించినట్లు చెప్పారు. నేర సొమ్ము మార్పిడికి 22 మంది పేర్లపై బ్యాంక్ ఖాతాలు తెరవించి వాటి ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కరెంట్ ఖాతాలు తెరవించేందుకు వ్యక్తులకు నెలకు రూ.50 వేల వరకు జీతం, ఖాతా తెరిచిన వారికి రూ.10 వేల వరకు చెల్లింపులు చేసినట్లు విచారణలో తేలింది.
*అరెస్టైనవారు* : ఉడతనేని వికాస్ చౌదరి, అడపా రామ వెంకట చరణ్ చౌదరి, అడపా సూర్య వెంకట తరుణ్, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్య సాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని సత్యశేఖర్, కాపుగంటి జోగేంద్ర శేషు, దేవళ్ళ వేణు, మామిడిశెట్టి సాయి కుమార్, పటాన్ ఇమ్రాన్ ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేష్.
*పరారీలో ఉన్నవారు* : బొప్పన నాగప్రియ, ఇస్లావత్ లక్ష్మి కళ్యాణ్, శీలం వేణుగోపాలరావు, నల్లంగుల శ్వేతన, వీరం శెట్టి వంశీ, బిల్లా సాయి తరుణ్, సంగం ప్రవీణ్ కుమార్, భూక్యా తరుణ్.
ఈ ముఠా విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ పెట్టుబడులు, గేమింగ్, బెట్టింగ్, రివార్డు పాయింట్లు, షేర్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్ పేర్లతో ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా ఏజెంట్ల ద్వారా తెరవించిన ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి, అనంతరం పలు ఖాతాల ద్వారా మార్పిడి చేసి చివరకు వ్యక్తిగత ఖాతాల్లోకి చేర్చి డాలర్లు, క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.


Comments