నాగారంలో పోకిరిగాళ్ల ఆగడాలు
_మాజీ ఎంపీపీ ముప్పు రామిరెడ్డిని ఢీకొట్టిన మైనర్లు
– ఒకరు అదుపులో, ఇద్దరు పరారీలో
కీసర, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా లో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో మళ్లీ పోకిరిగాళ్ల ఆగడాలు చోటు చేసుకున్నాయి. మోటార్ సైకిళ్లపై అతి వేగంగా సర్కస్ పీట్లు వేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు కీసర మండల మాజీ ఎంపీపీ ముప్పు రామిరెడ్డిని ఢీకొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.సమాచారం మేరకు, రోడ్డు పై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ వచ్చిన మైనర్లు అదుపు తప్పి రామిరెడ్డిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది.అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఘటన అనంతరం ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల కుషాయిగూడలో జరిగిన ఇలాంటి ఘటన మరువకముందే నాగారంలో మళ్లీ మైనర్లు వాహనాలతో రోడ్లపై హల్చల్ చేయడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Comments