బస్తిబాటలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చొరవ చూపారు
_డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన నెమలి అనిల్ కుమార్
– తక్షణ పరిష్కారానికి విజ్ఞప్తి
మల్లాపూర్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో నిర్వహించిన బస్తిబాట కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారు. కార్యక్రమంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాల లోపం వంటి అంశాలను స్థానికులు ప్రస్తావించారు.ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్ ను కలిసి, ప్రజలు తెలియజేసిన అంశాలను వినతిపత్రం రూపంలో అధికారికంగా సమర్పించారు. ప్రజల న్యాయమైన సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాదు, వాటికి పరిష్కారం తీసుకురావడమే మా ప్రధాన బాధ్యత. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి గొంతుకగా నిరంతరం పోరాడుతాం” అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ వి.శ్రీనివాస్, హరికృష్ణ, సురేష్ తదితరులు పాల్గొని ప్రజల తరఫున తమ మద్దతును తెలిపారు.


Comments