ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా సీఐటీయూ ఘన నివాళులు
నాగారం, ఫిబ్రవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా నాగారం ఎస్వీ నగర్ రోడ్ నెంబర్–5లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ డబ్ల్యూ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మరియు సీఐటీయూ కీసర మండల నాయకులు చింతకింది అశోక్ శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. బీసీ సామాజిక వర్గాల నుంచి అధికారంలోకి వచ్చిన శివాజీ మహారాజ్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. తన రాజ్యంలో మెహర్ వంటి అట్టడుగు వర్గాల వారికి సైన్యంలో సముచిత స్థానం కల్పించడంతో పాటు ముస్లింలను కూడా సైన్యాధికారులుగా నియమించి మతసామరస్యానికి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించిన పాలకుడిగా శివాజీ చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే తన సామాజిక ఆలోచనలకు శివాజీ మహారాజ్ నుంచి స్ఫూర్తి పొందారని తెలిపారు. శివాజీ జయంతి ఉత్సవాలను మొదటిసారిగా ఘనంగా నిర్వహించిన వారిలో జ్యోతిరావు పూలే ముందుండగా, తరువాత బి.ఆర్. అంబేద్కర్ కూడా ఆ సంప్రదాయాన్ని అనుసరించారని అన్నారు.
నేటి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం దుర్మార్గమని, దానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. శివాజీ రూపొందించిన మతసామరస్య మార్గాన్ని కొనసాగించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కే. అనిల్ కుమార్, ఎం. నరసింహారెడ్డి, ఏ. శ్రీనివాస్, హేమంత్, కృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments