కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం
జిల్లా కలెక్టర్కు ఆలయ కమిటీ కృతజ్ఞతలు
కీసర, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ లో కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు భక్తుల నడుమ ఘనంగా, విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, రుద్రహోమం, కళ్యాణోత్సవం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.బ్రహ్మోత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డిలను ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ, ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు.ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులకు ఆలయ కమిటీ అభినందనలు తెలిపింది.


Comments