వెల్టూర్ లో వడ్డె శేఖర్ కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
పెద్దమందడి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి లబ్ధిదారులను అభినందించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఇదే సందర్బంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన వడ్డె శేఖర్ నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. వడ్డె శేఖర్ మరియు ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని కొంతసేపు ముచ్చటించారు. పార్టీ కోసం అంకితభావంతో కృషి చేసిన వడ్డె శేఖర్ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని, గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే శేఖర్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments