క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.760 కోట్లను కేటాయించిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యతోపాటు క్రీడలను కూడా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కప్ రెండో ఎడిషన్ క్రీడా పోటీల్లో భాగంగా శనివారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న సెపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వనపర్తి విద్యా ప్రగతికి పేరుగాంచిన ప్రాంతమని, ఇదే పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటలాడిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు వనపర్తి విద్యతో పాటు క్రీడల్లోనూ ముందంజలో నిలుస్తోందని అన్నారు.రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments