యూరియా యాప్ గందరగోళం రైతులకు తిప్పలు
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 21: (తెలంగాణ ముచ్చట్లు)
యూరియా సరఫరాలో పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు వరంగా కాకుండా భారంగా మారిందని బీజేపీ మండల ఎస్సీ మోర్చ అధ్యక్షుడు చదిరం రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాప్ అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో రాకేష్ మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు హింగే శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. యాప్ అమలులో ఉన్న సమస్యలను దాచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేస్తున్నప్పటికీ సరఫరా ఆలస్యమవుతోందని, కొందరు రైతులు పలుమార్లు రైతు వేదికల చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలిపారు. “యాప్ ప్రచారం గట్టిగా చేస్తున్నారు కానీ రైతులకు యూరియా మాత్రం దొరకడం లేదు” అని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ అవడం, ఓటీపీ రాకపోవడం వంటి ఇబ్బందులతో రైతులు రోజులు తరబడి తిరుగుతున్నారని చెప్పారు.
పంటల కీలక దశలో యూరియా అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఒక చిన్న రైతు మాట్లాడుతూ, “మూడుసార్లు యాప్లో నమోదు చేశాం. ప్రతి సారి లోపం చూపిస్తోంది. పంటకు ఇప్పుడే ఎరువు అవసరం. ఆలస్యం అయితే నష్టం మాది” అని వాపోయాడు. మరో వృద్ధ రైతు “మాకు స్మార్ట్ఫోన్ లేదు. పిల్లలపై ఆధారపడాల్సి వస్తోంది. యాప్ లేకుండా యూరియా ఇవ్వడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎస్సీ, ఎస్టీ మరియు చిన్న రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని రాకేష్ పేర్కొన్నారు. “రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెబుతున్నారు. అయితే రైతు వేదికల వద్ద కనిపిస్తున్న క్యూలు ఏంటి? సర్వర్ సమస్యలే అయితే వెంటనే పరిష్కారం ఎందుకు చూపడం లేదు?” అని ప్రశ్నించారు.
బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలనే పేరుతో రైతులపై అదనపు భారం మోపడం సరికాదని, యాప్లో లోపాలు సరిచేసే వరకు ఆఫ్లైన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.


Comments