రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని నాగ వైష్ణవి బంగారు పతకం
_రూ.25 వేల నగదు బహుమతి అందుకున్న విద్యార్థిని
– సన్మానించిన ఎంఈఓ జమదగ్ని
కీసర, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పి. నాగ వైష్ణవి రాష్ట్రస్థాయి తైక్వాండో మార్షల్ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చింది. ఇటీవల హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ తైక్వాండో పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆమె, గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో రూ.25 వేల నగదు బహుమతిని అందుకుంది.(యం.ఎస్) తైక్వాండో అకాడమీలో కోచ్ మధుసూదన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న నాగ వైష్ణవి క్రమశిక్షణ, కృషితో ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు. ఆమె సోదరి నాగ సంతోష్కు కూడా శిక్షణ అందిస్తూ విజయాలకు మార్గనిర్దేశం చేస్తున్న కోచ్ మధుసూదన్ సేవలను అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా కీసర మండల విద్యాధికారి (ఎంఈఓ) జమదగ్ని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, తైక్వాండో, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్లోనూ రాణించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణమని పేర్కొన్నారు.విజయం సాధించిన నాగ వైష్ణవి మరియు కోచ్ మధుసూదన్లను ఎంఈఓ జమదగ్ని, పాఠశాల చైర్మన్ రమాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments