చర్లపల్లి పీఏసీలో ఆయుర్వేద గ్రామం పునఃప్రారంభం ఖైదీలకు వెల్నెస్, థెరపీ శిక్షణ
కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ ప్రారంభం
చర్లపల్లి, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఖైదీల సంక్షేమం, పునరావాసానికి తోడ్పడే దిశగా చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ (పీఏసీ)లో ఆయుర్వేద గ్రామం మరియు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా బుధవారం ప్రారంభించారు. ఆరు సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని తిరిగి ప్రారంభించడం ప్రత్యేకత సంతరించుకుంది.ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, ఆయుర్వేద గ్రామం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆయుర్వేద చికిత్సలు అందించడమే కాకుండా ఖైదీలకు వెల్నెస్, థెరపీ సేవలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన ఖైదీలు విడుదల అనంతరం స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.జైలు శాఖలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్లో సంప్రదాయ పద్ధతిలో రసాయనాలు లేకుండా నూనెల తయారీ చేపట్టనున్నారు. ఈ యూనిట్ ద్వారా తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ వంటి అంశాల్లో ఖైదీలకు ప్రాయోగిక శిక్షణ ఇవ్వనున్నారు.ఈ రెండు కేంద్రాల ప్రారంభంతో ఖైదీల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జైలు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో డీఐజీలు
డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎం. ఖాలిద్ అక్తర్, సూపరింటెండెంట్లు డి. భారత్, జి. ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, జైలు అధికారులు పాల్గొన్నారు.


Comments