న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మద్దతు
వనపర్తి,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి లో గత నాలుగు రోజులుగా న్యాయవాదులు తమ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పెడధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ కరువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి కేసునైనా వాదించకూడదనే హక్కు న్యాయవాదికి ఉండదని, కక్షిదారునికి న్యాయం చేయడమే వారి వృత్తి ధర్మమని స్పష్టం చేశారు. అంతమాత్రాన వ్యక్తిగత కక్ష పెంచుకొని దాడులకు దిగడం అవివేకమని పేర్కొన్నారు.సమాజ పరిస్థితులు ఎలా ఉన్నా యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుని న్యాయాన్ని నిలబెట్టాలని సూచించారు.వృత్తిలో ఈర్ష్య, ద్వేషాలు విడిచి తమ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.


Comments